telugutalli


భారతదేశ భూభాగం ప్రధానంగా నాలుగు భాగాలుగా ఉంది.
అవి: పర్వతమండలం, గంగ-సింధు మైదానం ,  ఎడారిప్రాంతం ,  దక్కను పీఠభూమి .

దక్కను పీఠభూమిలో అధికభాగాన్ని ఆక్రమించిన ప్రదేశమే తెలుగుగడ్డ . దాన్నే మనం ఆంద్రప్రధేశ్ అంటున్నాం.

త్రిలింగాలు అనగా ద్రాక్షారామం , కాళేశ్వరం , శ్రీశైలం కొలువున్న ప్రాంతం కనుక ఆంధ్రదేశాన్ని త్రిలింగదేశం అనేవారు . తెలుగుప్రాంతంలో ఉంటున్నాం కాబట్టి మనం తెలుగువారిగా పిలువబడ్డాం .  

దక్కన్ అంటే దక్షిణం . దక్షిణ దిక్కున నివసిస్తున్నాం కాబట్టి తెలుగువారిని దక్షిణాదివారు  అంటారు .  

క్రీస్తు పూర్వం 1500-1000 సం. ల కాలంలో దక్కను ప్రాంతాన్ని దండకారణ్యం అనేవారు.
క్రీ.పూ. 800 లో రచించిన ఐతరేయబ్రాహ్మణంలో దక్షిణాపథంలో నివశించిన ఆంధ్రులు అనే తెగ గురించి వివరంగా ఉంది. ఆ తెగ వారే మన పూర్వులు .

ఆంధ్రుల ప్రస్తావన అశోకుడు చెక్కించిన శిలాశాసనాలలో లభ్యం అయింది .
క్రీస్తు శకం 1 వ శతాబ్దంలో పిన్లీ అనే చరిత్ర కారుడు 30 గొప్ప పట్టణాలు  , లక్షమంది సైనికులు , రెండువేలమంది అశ్విక దళం , వెయ్యి ఏనుగులు కల ఒక ఆంధ్ర రాజు గురించి రాశాడు .
తెలంగాణాలోని మెదక్ జిల్లా లో , హైదరాబాద్ కు 43  మైళ్ళ దూరాన ఉన్న కొండాపూర్ ఈ పట్టణాల్లో ఒకటి అని చరిత్రకారులు స్పష్టం చేశారు .

మొట్టమొదటి ఆంధ్రరాజులు శాతవాహనులు. వీరి పాలనాకాలం క్రీ.పూ.230-క్రీ.శ.227 సం. లు. వీరు బ్రాహ్మణులు.
అంతకుముందు పాలించిన రాజులు మౌర్యులు.
శాతవాహన వంశ మూలపురుషుడు పిముకుడు. వీరిలో పేరెన్నికగన్న రాజు గౌతమీపుత్ర శాతకర్ణి.  
శాతవాహనుల మొదటి రాజధాని క్రిష్ణాతీరాన ఉన్న శ్రీకాకుళం. ఇది ప్రస్తుతం క్రిష్ణా జిల్లాకు చెందిన ఘంటసాల మండలంలో ఉంది.
వీరు ధర్మ, ఇంద్ర,వాసుదేవ, శివ మొదలైన దేవుళ్ళను ఆరాధించేవారు . బౌద్దమతం కూడా విలసిల్లింది .

తర్వాత ఆంధ్రప్రాంతాన్ని పాలించిన వారు ఇక్ష్వాకులు. వీరి పాలనాకాలం క్రీ.శ. 225-300.
క్రీ.శ. 275-400 మధ్య శాలంకాయనులు ఈ ప్రాంతాన్ని  పాలించారు .
విష్ణుకుండినుల పాలనాకాలం క్రి.శ. 440-615.
క్రీ.శ. 500-757 మధ్య బాదామి చాళుక్యులు  ఏలికలు. వీరు దక్కన్ ప్రాంతం లో పెద్దభాగాన్ని పాలించారు.

చోళ , చాళుక్య రాజ్యాల పతనం నుంచి కాకతీయ రాజ్యం పుట్టుకొచ్చింది . కాకతీయ రాజుల పాలనాకాలం క్రీ.శ . 100-1323. కాకతీయుల మూల పురుషుడు కాకర్త్యగుండవ. 1267 లో గద్దెనెక్కిన రాణి రుద్రమదేవి తెలుగు స్త్రీ శౌర్యానికి ప్రతీక. ఆమె 1295 వరకు జనరంజకం గా పాలించింది. ఈ పరిణామాలను మార్కోపోలొ గ్రంధస్తం చేశాడు.

క్రీ,శ. 1158 లో పాలించిన కాకతీయరాజు ఒకటవ ప్రతాప రుద్రదేవుడి హయాంలోనే హన్మకొండలోని వేయిస్థంభాల గుడి  నిర్మించబడింది . రుద్రమదేవి మనవడు , కాకతీయ రాజులలో ఆఖరివాడు రెండవప్రతాపరుద్రుడు 1323 లో మహమ్మద్ బీన్ తుగ్లక్ దండయాత్రలో ఓడిపోయి బందీగా చిక్కి అవమానం భరించలేక మార్గమధ్యంలో నర్మదానదిలో దూకి ఆత్మహత్య  చేసుకున్నాడు.  దాంతో కాకతీయుల స్వర్ణయుగం అంతం అయింది .

తర్వాత నాయకరాజులు , కొండవీటి  రెడ్డిరాజులు ఏలికలు.  
1294 లో దక్కనులోకి మహమ్మదీయుల దండయాత్ర జరిగింది . ఖిల్జి వంశానికి చెందిన జమాలుద్దీన్ దేవగిరిపై దండెత్తి రాజా రాం దేవ్ అనే యాదవరాజును ఓడించి మాళ్వా ప్రవేశించాడు. దీనితో దక్కను ప్రాంత ద్వారాలు తెరుచుకున్నాయి. తర్వాత ఎన్నడూ మూసుకోలేదు.  
14 వ శతాబ్ధం నుంచి బహమనీ రాజులు ,తర్వాత నిజాం షాహీలు దక్కను ప్రాంతాన్ని పాలించారు.  

గోల్కొండను సామంతుడిగా పరిపాలిస్తున్న కులీ కుతుబ్ ఉల్ 1512 లో స్వాతంత్ర్యం ప్రకటించుకుని తన పేరును సుల్తాన్ కులీ కుతుబ్ షా గా మార్చుకున్నాడు . ప్రసిద్ది కాంచిన కుతుబ్ షాహీ వంశానికి ఇతడే మూలపురుషుడు .  
1550-1580 మధ్య గోల్కొండ పాలకుడైన ఇబ్రహీం కుతుబ్ షా కుమారుడు మహమ్మద్ కులీ కుతుబ్ షా .ఇతడే హైదరాబాద్ నగరాన్ని నిర్మించాడు. ఇతని ప్రియురాలు భాగమతి పేరు మీదుగానే నగరాన్ని భాగ్యనగర్ అని పిలిచేవారు. ఈ సమయం లోనే చారిత్రాత్మకమైన చార్మినార్ నిర్మించబడింది.
తర్వాత గోల్కొండను అబ్దుల్లా కుతుబ్ షా , , అబ్దుల్ హసన్ తానిషా పాలించారు . తానిషా మంత్రులే అక్కన్న,మాదన్న లు.
1687 లో ఔరంగజేబు గోల్కొండను వశపరచుకున్నాడు.  ఒక అధికారి లంచగొండితనం వల్ల గోల్కొండ ఔరంగజేబు వశం అయింది. తానాషాను బందీగా  కోటకు తరలించారు. దీంతో కుతుబ్ షాహి వంశం పతనం  అయింది.
అసఫ్ జా వంశం 1720 లో అధికారం లోకి వచ్చింది. అసఫ్ జా అనే బిరుదు కల నిజాముల్ ముల్క్ డిల్లీ సుల్తానుల అధికారాన్ని అంగీకరించి దక్కన్ లో పాలన సాగించేవాడు.

1750 లో బ్రిటిష్ వారు హైదరాబాద్ నిజాం గా ఒకటవ అసఫ్ జా కుమారుడు సలాబత్ జంగ్ ను సిం హాసనం  మీద కూర్చోబెట్టారు.  అసఫ్ జా వంశస్తులలో ఆఖరి వాడైన ఉస్మాన్ ఆలిఖాన్ 1911 లో సిం హాసనం  ఎక్కాడు. 1948 సెప్టెంబర్ లో  హైదరాబాద్  సంస్థానం మీద భారత ప్రభుత్వపు పోలీస్ చర్య జరిగేవరకు ఏడవ అసఫ్ జా గా పిలవబడే ఉస్మాన్ ఆలీ ఖానే అధికారం లో కొనసాగాడు .

" మాకొద్దీ తెల్ల దొరతనం " అంటూ యావద్భారతీయులు ఉద్యమిస్తున్నపుడు తెలంగాణ ప్రజలు నిజాం ప్రభుత్వ కసాయి పాలనలో " నీ బాంచెన్ దొర  కాల్మొక్త " అంటూ జాగీర్దారుల కాళ్ళ కింద నలుగుతుండేవారు. హైదరాబాద్ రాష్ట్రం మొత్తం భూమిలో 30 శాతం జాగీరుల కింద ఉండేది.
సామాన్య ప్రజలు బానిసత్వం లో మగ్గిపోతూ కనాకష్టమైన బ్రతుకు   బ్రకుతుండేవారు.   
ఆకలికడుపుల రైతాంగం మేల్కొంది. " గోల్కొండ కింద నీ గోరి కడతం కొడకో" అంటూ నిజాం నవాబునే బెదిరించింది.

1946 లో రావి నారాయణ రెడ్డి నాయకత్వంలో  తెలంగాణ సాయుధ పోరాటం ప్రారంభమైంది. దీనికి ప్రతిగా " మేమే పాలకులం " అనే నినాదంతో ఖాసిం రజ్వీ నాయకత్వంలో రజాకార్లు విరుచుకుపడ్డారు.
1947 లో మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నిజాం ప్రభుత్వం స్వతంత్ర రాజ్యంగా కొనసాగడానికి నిశ్చయించింది.
1948  సెప్టెంబర్ 13 న భారత ప్రభుత్వం నిజాం ప్రభుత్వం మీద పోలీసు చర్య తీసుకోవడానికి నిర్ణయించింది.  సెప్టెంబర్ 17 న సైన్యం హైదరాబాద్ లో ప్రవేశించింది. భారతసైన్యం ధాటికి నిజాం తలొంచక తప్పలేదు.
పోలీస్ చర్యకు నాయకత్వం వహించిన మేజర్ జనరల్ చౌదరి హైదరాబాద్ రాష్టానికి మిలిటరీ గవర్నర్ గా నియమితుడయ్యాడు. అయితే నిజాం కు రాజప్రముఖ్ స్థానం కల్పించారు.

హైదరాబాద్  రాష్ట్ర కమిటి అధ్యక్షుడు కె.వి.రంగారెడ్డి  తదితరులు స్థానికుల అభివృద్ది కోసం , తెలంగాణ అభివృద్ది కోసం పాటుపడసాగారు.
1947 లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. వెంటనే ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం  ఏర్పాటు అవుతుందని తెలుగువారు ఆశించారు. కానీ వారి  ఆశ నిరాశ అయింది .

స్వామి సీతారాం ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం కోసం  1951 ఆగష్టు 15 న నిరాహార దీక్ష ప్రారంభించాడు. ఇది ఆంధ్ర ప్రాంతంలో చాలా ఉద్రిక్తత  కలుగజేసింది. ఆచార్య వినోబాభావే సలహా మేరకు సెప్టెంబర్ 20 న స్వామి సీతారాం తన 31 రోజుల నిరాహార దీక్షను విరమించాడు.

అమరజీవి పొట్టిశ్రీరాములు  ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం కోసం 19 అక్టోబర్ 1952 న మద్రాసులో తెలుగు వారి ప్రత్యేక రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించాడు. పట్టు వదలని దీక్షతో కఠోరమైన ఉపవాసంతో 1952 డిసెంబర్ 15 న పొట్టి శ్రీరాములు తన తెలుగుసోదరుల కోసం ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఆ ధన్యజీవి బలిదానంతో .. ఆంధ్రరాష్ట్రం  ఏర్పాటు అయింది.

1952 డిసెంబర్ 19 న లోక్ సభలో భారత ప్రధాని నెహ్రూ మద్రాసు మినహా తెలుగు భాషా జిల్లాలను కలిపి ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాడు.
చివరకు కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పాటయింది. అక్టోబర్ 1,1953 న టంగుటూరి పకాశం ముఖ్యమంత్రిగా కొత్త రాష్ట్రానికి నెహ్రూ ప్రారంభోత్సవం చేశాడు. తర్వాత మూడేళ్ళకు హైదరాబాద్ రాష్ట్రాన్ని కలుపుకుని విశాలాంద్ర ఏర్పాటయింది.

1956 నవంబర్ 1 న నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ,సి.యం. త్రివేది గవర్నర్ గా ఆంధ్రప్రదేశ్ అవతరించింది.

a.p.asembly1


Like it on Facebook, Tweet it or share this article on other bookmarking websites.

No comments